పెండింగ్ చలాన్ల పేరుతో మళ్లీ బండి జప్తు: హోం సెక్రటరీ, డీజీపీలకు హైకోర్టు నోటీసులు

  • వాహనాలు సీజ్ చేయవద్దంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు
  • హైకోర్టు ఆదేశాలను పాటించకుండా వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు
  • హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన బాధితుడు

పెండింగ్ చలాన్లు ఉన్నాయనే నెపంతో వాహనాలను జప్తు చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. న్యాయస్థానం గతంలో జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నందుకు గాను ఉన్నతాధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.


పెండింగ్ చలాన్లు ఉన్నంత మాత్రాన పోలీసులు వాహనాలను సీజ్ చేయకూడదని గతంలోనే హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పోలీసులు ఇంకా వాహనాలను జప్తు చేస్తున్నారని ఒక బాధితుడు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం... రాష్ట్ర డీజీపీ, హోం శాఖ కార్యదర్శి, అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాహనాలను ఎందుకు సీజ్ చేస్తున్నారో తెలపాలని, దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.


అధికారుల వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది. పెండింగ్ చలానాల విషయంలో పోలీసులు కేవలం చట్టపరంగా జరిమానా వసూలు చేయాలి తప్ప, వాహనాన్ని స్వాధీనం చేసుకునే హక్కు లేదని ఈ పరిణామం ద్వారా మరోసారి స్పష్టమైంది.


TG High Court
Chalan Vehicles

More Telugu News